ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం... ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి

  • బాలుర ప్రాణం తీసిన ఈత 
  • ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో ఘటన
  • మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు
  • వేసవి తాపం నుంచి సేద తీరేందుకు వెళ్లి దుర్ఘటన
  • సంఘటనపై మంత్రి స్వామి దిగ్భ్రాంతి, విచారణకు ఆదేశం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గురువారం నాడు ఒంగోలు మండలం పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే, మృతులను కర్రేటి అభిరామ్ (14), కర్రేటి సుశాంత్ (12), పొదిలి చిన్ను (11), ఇల్ల దినేష్‌ (10)గా గుర్తించారు. వీరిలో అభిరామ్, సుశాంత్ అన్నదమ్ములు. వేసవి తాపం అధికంగా ఉండటంతో ఉపశమనం కోసం వీరంతా సరదాగా ఈత కొట్టేందుకు గ్రామ సమీపంలోని ఓ నీటి గుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత నలుగురి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దుర్ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డీఎస్‌బీవీ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Prakasam Tragedy
Children
Drowning
AP

More Telugu News